బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా వెలువడిన ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 202 స్థాలను గెలుచుకున్న విషయం తెల్సిందే. దీంతో నితీశ్ కుమార్ మరోమారు సీఎం కుర్చీలో కూర్చోనున్నారు. ఈ కొత్త ప్రభుత్వం ఈ నెల 19 లేదా 20 తేదీలలో కొలువుదీరే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం గాంధీ మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఆదివారం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు సమర్పించనుందని.. ఆ తర్వాత కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రమాణస్వీకారానికి 19 లేదా 20లలో ఏ తేదీని నిర్ణయిస్తారనే విషయం ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్పై ఆధారపడి ఉంటుందని తెలిపాయి. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు తెలస్తోంది. ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత నీతీశ్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పిస్తారు. తద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమవుతాయి.
కాగా, కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు కోసం కేంద్రమంత్రి అమిత్షాతో కూటమి నేతలు శనివారం సమావేశమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో భాజపాకు సింహభాగం వాటా దక్కే అవకాశం ఉన్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. తర్వాతి స్థానంలో జేడీయూ ఇతర పార్టీలు ఉన్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)కి మూడు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం.