శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (20:11 IST)

దేశ ద్రోహం చేశాననిపించింది.. నా గర్ల్‌ఫ్రెండ్‌తో మాత్రమే.. ఇషాంత్ శర్మ

2013వ సంవత్సరం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించింది. ఆస్ట్రేలియాతో మొహాలి స్టేడియంలో మూడో వన్డే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ధోని(139*) తో రాణించడంతో నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆసీస్‌కు విజయం సాధించాలంటే చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి. 
 
ఆ సమయంలో భారత బౌలర్ ఇషాంత్ శర్మ వేసిన ఓవర్లో వరుసగా 4, 6, 6, 6, 2, 6 తో ఏకంగా 30 పరుగులు చేసాడు ఆసీస్ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్. దాంతో ఆసీస్‌కు చివరి 2 ఓవర్లలో 14 పరుగులు కావాల్సి ఉండగా మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఫాల్కనర్ తన జట్టుకు విజయం అందించాడు.
 
అయితే ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో దారుణమైన తన ఓవర్ గురించి చెప్పుకొచ్చాడు ఇషాంత్ శర్మ. ''ఆ మ్యాచ్‌ నా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. నేను చేసిన ఆ పనిని దేశ ద్రోహం అనుకున్నాను. ఇక ఆ బాధను మర్చి పోవడానికి ఒక 2-3 వారాలు ఎవరితో మాట్లాడలేదు. ఆ సమయం మొత్తం కేవలం నా గర్ల్‌ఫ్రెండ్‌తో మాత్రమే ఫోన్ మాట్లాడాను. 
 
అలా ఆమెతో మాట్లాడుతూ ఏడ్చాను కూడా. మ్యాచ్ ఓడినప్పటి నుంచి సరిగ్గా తినలేదు. ఒకవేళ టీవీ పెడితే మొత్తం అని ఛానల్స్‌లో నాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అవి చూస్తే నాకు ఇంకా బాధ అనిపించేది' అంటూ ఇషాంత్ వివరించాడు.