గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (11:02 IST)

శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా - కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!!

hardik pandya
భారత క్రికెట్ జట్టు ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది. టీమిండియాకు కొత్త కోచ్‌గా నియమితులైన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రయాణం కూడా ఈ టూర్ నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు టీమిండియాకు కెప్టెన్‌‍గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు. 
 
జట్టుకు చెందిన సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌‍గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. శ్రీలంకతో టీమిండియా జులై 27 నుంచి 30 వరకు 3 టీ20లు... ఆగస్టు 2 నుంచి 7 వరకు 3 వన్డేలను ఆడనుంది. 
 
ఇకపోతే, శ్రీలంకతో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ పునరాగమనం చేయడం ఖాయమని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియాలో స్థానం దక్కించుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా బెర్తుల కోసం యువ ఆటగాళ్లు పోటీ పడుతుండడంతో, కేఎల్ రాహుల్‌‌కు ఆ ఫార్మాట్లో స్థానం కష్టమే.