శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (16:49 IST)

ధోనీని హిట్ మ్యాన్ పొగిడితే.. కపిల్ దేవ్ మాత్రం అలా అనేశాడు.. (Video)

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కొనియాడాడు. భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్ ధోనీ అని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా వుంటాడని తెలిపాడు. అదే ధోనీ గొప్పతనమని చెప్పుకొచ్చాడు. ధోనీ కెప్టెన్‌గా టీమిండియాకు అన్ని ఐసీసీ ట్రోఫీలను అందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన విషయాన్ని రోహిత్ గుర్తు చేశాడు. 
 
2007 టీ-20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను కూడా సంపాదించిపెట్టాడని వెల్లడించాడు. ధోనీ ఎలా వుంటాడో యావత్ భారత దేశానికి తెలుసునని  చెప్పుకొచ్చాడు. అలా ప్రశాంతంగా వుండటం వల్లే మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగాడని తెలిపాడు. ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలకడ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రధాన కారణం ధోనీనేనని వెల్లడించాడు. 
 
రోహిత్ ఇలా ధోనీని ఆకాశానికి ఎత్తేస్తే.. భారత మాజీ సారధి కపిల్‌ దేవ్ మాత్రం ధోనీ పునరాగమనం మాత్రం కష్టమన్నాడు. ధోనీ ఆరేడు నెలలు క్రికెట్‌ దూరమై తన భవితవ్యంపై ఎన్నో అనుమానాలు రేకెత్తించాడని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో పునరాగమనం చేయడం చాలా కష్టం. కానీ.. ధోనీకి వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ ఎంతో కీలకం అని కపిల్‌ దేవ్ పేర్కొన్నారు. ఐపీఎల్‌లో బాగా ఆడితే టీ20 ప్రపంచకప్‌కు ధోనీ పోటీలో ఉంటాడని ఇప్పటికే టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్న సంగతి తెలిసిందే.
 
అయితే కపిల్‌ దేవ్ మాట్లాడుతూ... ''చాలా కాలం క్రికెట్‌కు దూరమైతే తిరిగి పునరాగమనం చేయడం ఎవరికైనా చాలా కష్టం. కానీ.. ధోనీకి ఐపీఎల్‌ లాంటి టోర్నీతో మంచి అవకాశం ముందుంది. ధోనీకి  ఐపీఎల్ ఎంతో కీలకం. అయితే భారత సెలక్టర్లు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేయాలి. ధోనీ దేశం తరఫున ఎన్నో సాధించాడు. కానీ.. ఆరేడు నెలలు క్రికెట్‌కు దూరమై అందరిలోనూ తన భవితవ్యంపై సందేహాలు రేకెత్తించాడు. దీంతో అనవసర చర్చలు సాగుతున్నాయి. త్వరగా నిర్ణయం తీసుకోవాలి" అని కపిల్ అన్నారు.