ఆదివారం, 19 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2025 (17:03 IST)

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

Konda surekha
తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గంలో వివాదం చెలరేగింది. సీనియర్ మంత్రిగా ఉన్న కొండా
Konda surekha
సురేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు ఉన్నారు. దీంతో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా కొండా సురేఖ హాజరుకాలేదు. పార్టీలో, ప్రభుత్వంలో తనను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ముఖ్యనాయకులను కలిసి చెప్పినట్లు సమాచారం. పైగా, మంత్రి ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను తొలగించడం, బుధవారం రాత్రి ఆయన కోసం పోలీసులు తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో.. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి సురేఖ హాజరు కాలేదు. అదేసమయంలో ఆమె ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో సమావేశమయ్యారు. 
 
సూర్యాపేట జిల్లాలోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ తుపాకీతో బెదిరించినట్లు మరో మంత్రి ఉత్తమ్ సీఎంకు, మీనాక్షికి చెప్పడంతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. సుమంత్ కోసం గాలించిన పోలీసులు అతడు జూబ్లీహిల్స్‌లోని మంత్రి సురేఖ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లడం సంచలనంగా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ.. హైదరాబాద్ నగరంలోనే ఉన్నా మంత్రివర్గ సమావేశానికి వెళ్లకుండా కుమార్తె సుస్మితతో కలిసి తొలుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. 
 
తర్వాత ఆమె మీడియాతో మాట్లాడతారని తెలియడంతో మీనాక్షి ఫోన్ చేసి వారించారు. కలిసి చర్చిద్దామని.. వివాదం గురించి మీడియాతో ఏమీ మాట్లాడవద్దని సూచించారు. దీంతో సురేఖ తన కుమార్తెతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లి మీనాక్షి, మహేశ్ కుమార్‌ గౌడ్‌తో సమావేశమయ్యారు. తన వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను తొలగించడం, బుధవారం రాత్రి పోలీసులు తన ఇంటికి రావడం తదితర పరిణామాలను సురేఖ వారికి వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించి ఓఎస్డీకి సుమంత్‍కు బాసటగా నిలిచిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం.