గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (17:50 IST)

మోతేరా టెస్టులో ఇంగ్లండ్ 205 రన్స్‌కు ఆలౌట్

అహ్మదాబాద్‌లోని మోతేరా క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ  తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఖాతా ఆరంభించకుండానే ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ బౌలింగులో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు.
 
అంతకుముందు.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లపై తన తడబడి 205 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో టెస్టుతో పోల్చితే కాస్త మెరుగ్గా ఆడిన ఇంగ్లండ్ టాస్ గెలిచిన ఆధిక్యతను మాత్రం నిలుపుకోలేకపోయింది. తొలిరోజు చివరి సెషన్ ముగియకముందే వికెట్లన్నీ కోల్పోయింది.
 
టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4/68), అశ్విన్ (3/47), సుందర్ (1/14) మరోసారి బంతిని గింగిరాలు తిప్పగా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (2/45) కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ (5), జానీ బెయిర్ స్టో (28)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు.
 
55 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. డాన్ లారెన్స్ 46 పరుగులు, ఓల్లీ పోప్ 29 పరుగులతో రాణించారు. అయితే వీరు టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ చేరారు.