శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఛట్టోగ్రామ్ టెస్టు : బంగ్లాదేశ్ 324 ఆలౌట్.. భారత్ ఘన విజయం

team india test
బంగ్లాదేశ్‌‍తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 513 భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 324 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 188 పరుగుల తేడాతో గెలిచింది.
 
ఈ టెస్టులో భారత్ తొలిత బ్యాటింగ్ చేసి తన తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 258/2 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. అలాగే, బంగ్లాదేశ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 513 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, భారత్ బౌలర్ల ధాటికి 324 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 188 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.
 
ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ఆట ప్రారంభమైన 50 నిమిషాల్లోనే బంగ్లాదేశ్ కేవలం 52 పరుగులు చేసి మిగిలిన నాలుగు వికెట్లను సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 77/4, కుల్దీప్ యాదవ్ 73/3 చొప్పున వికెట్లు పడగొట్టి గెలుపులో కీలక పాత్ర పోషించారు. 
 
అంతకుముందు ఐదో రోజున బంగ్లాదేశ్ 272/6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించింది. అయితే, ఐదో రోజు మూడో ఓవర్‌లోనే సిరాజ్ షాకిచ్చాడు. మెహిదీ హాసన్ (13)ను బోల్తా కొట్టించాడు. మరోవైపు, అర్థ శతకం పూర్తి చేసుకున్న షకిబ్ అల్ హాసన్‌ను కుల్దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.