1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2022 (23:21 IST)

శ్రేయాస్ అయ్యర్ సెంచరీ - రెండో వన్డే‌లో భారత్ విజయం

Shreyas Iyer
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయభేరీ మోగించింది. భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో ఈ విజయం సాధించింది. ఆదివారం జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారత జట్టు 25 బంతులు మిగిలి ఉండ‌గానే ఏడు వికెట్ల తేడాతో 282 ప‌రుగులు చేధించి విజ‌యం సాధించింది. 
 
మ్యాచ్ పూర్త‌య్యే స‌మ‌యానికి శ్రేయ‌స్ అయ్య‌ర్ 113, సంజూ శామ్‌స‌న్ 30 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు బ్జోర్ ఫార్టౌన్‌, వాయ్‌నే పార్నెల్‌, క‌గిసో ర‌బ‌డా ఒక్కో వికెట్ తీసుకున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన 279 పరుగులు చేసింది. సౌతాఫ్రికాలో ఆటగాళ్లలో అడెన్ మార్‌క్రమ్ 79, రీజా హెండ్రిక్స్ 74 ప‌రుగులు చేసినా ఉప‌యోగం లేక‌పోయింది.
 
ఆ తర్వాత 279 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీం ఇండియా ఓపెన‌ర్లు శిఖార్ ధావ‌న్ (కెప్టెన్‌), శుభ్‌మ‌న్ గిల్‌‌లు నిరాశపరిచినప్పటికీ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిషాన్ నిల‌క‌డ‌గా.. ఆచితూచీ ఆడుతూ.. వీలు చిక్కిన‌ప్పుడు బ్యాట్ ఝుళిపించారు. 
 
భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ 13, శుభమన్ గిల్ 28, ఇషాన్ కిషన్ 93, శ్రేయాస్ అయ్యర్ 113 (నాటౌట్), శాంసన్ 30 చొప్పున పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేశారు.