1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:37 IST)

చెలరేగిన స్మృతి మంధాన: 170 బంతుల్లో సెంచరీ మార్కు

Smriti Mandhana
భారత మహిళల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆడుతున్న డే అండ్ నైట్ టెస్టులో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చెలరేగింది. సూపర్ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపిన కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. స్మృతి మంధాన ధాటికి.. భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. 170 బంతుల్లో సెంచరీ మార్కును అందుకుంది ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్. అంతకు ముందు మొదటి రోజు ఆట వర్షార్పణం అయింది. 
 
క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న ఏకైక డే అండ్ నైట్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 44.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన మిథాలి సేనకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ (64 బంతుల్లో 31) శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పటిష్టమైన పేస్ బలగమున్న ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచి చూడచక్కని షాట్ లతో అలరించారు. 
 
కానీ 25 ఓవర్లో మోలినెక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన షెఫాలీ.. మెక్ గ్రాత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వన్ డౌన్‌లో వచ్చిన పూనమ్ రౌత్ చక్కటి సహకారాన్ని అందించింది. ఈ ఇన్నింగ్స్ లో మంధాన అయితే ఫోర్ల సునామి సృష్టించింది. 
 
ప్రస్తుతం ఆమె సాధించిన పరుగుల్లో 22 ఫోర్లు, 1 సిక్సర్లు ఉన్నాయ్. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు మంధాన ఎలా చెలరేగిందో. మంధాన దాటికి ఆసీస్ బౌలర్ డార్సీ బ్రౌన్ భారీగా పరుగులు సమర్పించుకుంది.
 
ప్రస్తుతం భారత్ వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పునమ్ రౌత్ (27 పరుగులు), స్మృతి మంధాన (126 పరుగులు) ఉన్నారు. స్మృతి మంధాన ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే భారత్ భారీ స్కోరు నమోదు చేసే ఛాన్స్ ఉంది.