1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (15:33 IST)

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : జింబాబ్వేకు షాకిచ్చిన నెదర్లాండ్స్

netherlands team
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, బుధవారం జింబాబ్వే జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. గ్రూపు-2 సూపర్-12 విభాగంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 19.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో సికందర్ రజా 40, సీని విలియమ్స్ 28లు మినహా మిగిలిన ఆటగాళ్లు రాణించలేకపోయారు. 
 
పెనర్లు వెస్లీ మెదెవెరె 1, ఎర్విన్ 3, చకబ్బా 5, షంబా 2, బర్ల్ 2 చొప్పున పరుగులు చేసి నిరాశపరిచారు. నెదర్లాండ్స్ జట్టు బౌలర్లలో మీకెరన్ మూడు వికెట్లు తీసి జింబాబ్వే జట్టును గట్టి దెబ్బతీశాడు. 
 
ఆ తర్వాత 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 18 ఓవర్లలో ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
ఆ జట్టులో ఒడౌడ్ (52) అర్థ సెంచరీతో రాణించాడు. అలాగే మరో ఆటగాడు టామ్ కూపర్ (32) రాణించడంతో నెదర్లాండ్స్ జట్టు గెలుపు సులభతరమైంది. 
 
నాలుగు మ్యాచ్‍‌లలో ఒక్క విజయంతో నెదర్లాండ్స్ రెండు పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ జట్టును ఓడించి సంచలనం సృష్టంచిన జింబాబ్వే జట్టు మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.