1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 మే 2025 (19:30 IST)

ఆసియా కప్ నుంచి భారత్ వైదొలుగుతుందా?

asia cup
ఆసియా కప్ క్రికెట్ పోటీల నుంచి భారత్ వైదొలుగుతుందంటూ వచ్చిన వార్తలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తోసిపుచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. దీంతో ఈ యేడాది జరుగనున్న ఆసియా కప్ టోర్నీ నుంచి భారత్ వైదొలగాలని నిర్ణయించినట్టు వార్తలు రాగా, వీటిని బీసీసీఐ ఖండించింది. 
 
ఈ యేడాది సెప్టెంబరు నెలలో పురుషుల ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా ఆడే అవకాశాలు లేవంటూ ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. అలాగే, జూన్ నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ పోటీల నుంచి కూడా భారత్ వైదొలుగుతుందంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్థాన్ మంత్రి, పీసీబీ చైర్మన్ మోసిన నఖ్వీ అధ్యక్షుడుగా ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీసీసీఐ ఖండించింది. 
 
"ఈ రోజు ఉదయం నుంచి ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీల్లో పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతున్న ప్రచారం మా దృష్టికి వచ్చింది. అటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటివరకు బీసీసీఐ, ఏసీసీ ఈవెంట్‌ల గురించి చర్చించలేదు. ప్రస్తుతం మా దృష్టంతా ఐపీఎల్‌ను సజావుగా నిర్వహించడంపైనే కేంద్రీకరించాం. ఆ తర్వాత టీమిండియా పురుషుల, మహిళల జట్లు ఇంగ్లండ్ పర్యటనపైనే ఉంది. ఆసియా కప్ విషయం లేదా మరేదైనా ఏసీసీ ఈవెంట్ గురించి ఏ స్థాయిలోనూ చర్చ జరగలేదు. దీని గురించి ఏదైనా వార్తలు వస్తే అవన్నీ అవాస్తం' అని స్పష్టం చేసింది.