శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (15:51 IST)

బౌలర్లకు పీడకలగా మారిన రో"హిట్".. క్యాచ్ మిస్ చేస్తే శతకమే...(video)

ఇంగ్లండ్‌ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్ల బౌలర్లకు ఓ పీడకలగా మారాడు. పైగా, ఫీల్డర్లు మిస్ చేసే క్యాచ్‌లను రోహిత్ శర్మ భలే సొమ్ము చేసుకుంటున్నాడు. తాను ఇచ్చే క్యాచ్‌లను మిస్ చేస్తే.. ఇక సెంచరీ దిశగానే రోహిత్ శర్మ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఈ విషయం తాజాగా మరోమారు నిరూపితమైంది. 
 
ఈ ప్రపంచ కప్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ ఇప్పటివరకు నాలుగు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలు చేశాడు. ఈ నాలుగు సెంచరీల్లో మూడు సెంచరీలు ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడచడం వల్ల వచ్చినవే కావడం గమనార్హం. అలాగే, ఆస్ట్రేలియాపై చేసిన ఓ అర్థ సెంచరీ కూడా అలానే వచ్చింది. 
 
ఈ టోర్నీలో సౌతాఫ్రికాపై ఒక్క పరుగు, ఇంగ్లండ్‌పై నాలుగు, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు జారవిడిచి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఒక్క ఇంగ్లండ్‌ మ్యాచ్ మినహా మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారత్ విజయభేరీ మోగించింది. పైగా, ఈ మ్యాచ్‌‌లలో ఆకాశమే హద్దుగా రోహిత్ చెలరేగిపోయాడు.
 
మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్ వన్డే మ్యాచ్‌లలో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు (230) కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ 228 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే, ఈ టోర్నీలో ఇప్పటివరకు 544 పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. 2003లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 673 పరుగులతో ముందున్నాడు.