గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (17:05 IST)

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ : భారత్ జట్టులో ముచ్చటగా ముగ్గురు కీపర్లు

ప్రపంచకప్‌లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మంగళవారం లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఏడు మ్యాచ్‌ల్లో 11 పాయింట్‌లతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. భారత్ తన ఇన్నింగ్స్‌లో భారీ పరుగులు చేసే అవకాశం మెండుగా ఉంది. బంగ్లాదేశ్ జట్టుకు ఛేజింగ్ ఓ ఛాలెంజ్ అని చెప్పాలి. 
 
కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి భారత్ తరపున ఏకంగా ముగ్గురు వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ బరిలోకి దిగారు. వారు ధోనీ, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్. ఇది చాలా అరుదైన విషయం అనే చెప్పాలి. కేదార్ జాదవ్‌కి బదులుగా దినేశ్ కార్తీక్ బరిలోకి దిగగా, శిఖర్ ధావన్, విజయ్ శంకర్‌లకు గాయాలు కావడంతో రిషబ్ పంత్‌కు అవకాశం వచ్చింది. 
 
అందుకే ఈ మ్యాచ్ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహించే ముగ్గురు వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్‌లు పాల్గొనడం ప్రత్యేకమైన విషయంగా క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.