ఆంధ్రా కేడర్ ఐఏఎస్ అధికారి అక్రమ సంబంధం.. అనుమానంతో మహిళను చంపేసి....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్కు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత అనుమానంతో ఆ మహిళను పరిపరి విధాలుగా అనుమానిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారిమధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. ఆ మహిళను కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. అయితే, తాను ఐఏఎస్ అధికారి కావడంతో తన పలుకుబడినంతా ఉపయోగించి, పోలీసులను మభ్యపెట్టి కేసు లేకుండా, ఈ హత్యా గుట్టు బయటకుపొక్కకుండా ప్రయత్నించాడు. అయితే, ఈ గుట్టు మాత్రం దాగలేదు. తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఓ వార్తా పత్రికలో ప్రచురితమైన కథనం మేరకు.. ఏపీ కేడర్కు చెందిన సదరు అధికారి గతంలో ఓ ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ, వైఎస్ జగన్ హయాంలో ఓ కీలక శాఖకు అధిపతిగానూ పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. తరచూ హైదరాబాద్లోని గడుపుతూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని తెలుస్తోంది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ అధికారి, తాను చికిత్స పొందుతున్న సమయంలో ఆ మహిళ వేరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించారు. ఈ అనుమానమే వారి మధ్య గొడవకు కారణమైంది. గత శుక్రవారం వీరిద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయిన అధికారి ఆమెను బలంగా కొట్టగా, ఆమె తల గోడకు తగిలి తీవ్ర గాయమైందని సమాచారం.
వెంటనే ఆమెను సమీపంలోని ఓ పెద్ద ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. అయితే, ఈ మరణానికి అసలు కారణాన్ని దాచిపెట్టి, 'ప్రమాదవశాత్తు కింద పడిపోవడం వల్ల గాయమైంది' అని ఆసుపత్రి రికార్డుల్లో నమోదు చేయించారని తెలుస్తోంది. తనకున్న అధికార పలుకుబడిని అడ్డం పెట్టుకుని, ఈ విషయం పోలీసుల వరకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం.
ఈ దారుణం జరిగిన తర్వాత ఏమీ ఎరగనట్టు విజయవాడకు తిరిగి వచ్చి తన విధుల్లో నిమగ్నమయ్యారు. అయితే, హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ ఘటన గురించి ఆయన సన్నిహితులకు, కొందరు ఐఏఎస్ వర్గాలకు ఇప్పటికే తెలిసిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.