బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మే 2023 (22:31 IST)

ఢిల్లీ బాలిక హత్య కేసు నిందితుడిని పట్టించిన ఫోన్ కాల్!!

sakshi accused
ఇటీవల ఢిల్లీ నడిబొడ్డున తన స్నేహితురాలిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచి, తలపై బండరాయితో మోది చంపేసిన కేసులో ప్రధాన నిందితుడు సాహిల్‌ను ఓ ఫోన్ కాల్ పట్టించింది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. తన స్నేహితురాలైన 16 యేళ్ల సాక్షిని హత్య చేసిన తర్వాత సాహిల్ తన మొబైల్ ఫోనును స్విచాఫ్ చేశాడు. ఢిల్లీలో హత్య చేసిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుని, బులంద్‌షహర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇందుకోసం బస్సులో ప్రయాణించాడు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్‌ చేశాడు. కానీ, పోలీసులు వెంటనే అతడి కాల్‌ ఆధారంగా లొకేషన్‌ను గుర్తించారు.
 
ఇక సాక్షి పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం ఆమె పుర్రె భాగం పూర్తిగా పగిలిపోయినట్లు తేలింది. హంతకుడు తొలుత ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం నిర్జీవంగా పడి ఉన్న ఆమె శరీరాన్ని ఒక సిమెంట్‌ దిమ్మతో పదేపదే కొట్టాడు. మృతురాలికి అతడితో మూడేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ క్రమంలో అతడి నుంచి ఆమె విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయంపై వీరిద్దరి మధ్య శనివారం గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు సమాచారం. మృతురాలి చేతిపై 'ప్రవీణ్‌' పేరిట ఓ టాటూ ఎప్పటి నుంచో ఉంది. దానిపై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
 
పైగా, హంతకుడు సాహిల్‌కు మద్యం, హుక్కా అలవాట్లు ఉన్నట్లు అతడి సోషల్‌ మీడియా ఖాతా ద్వారా గుర్తించారు. మిత్రులతో కలిసి హుక్కా తాగుతూ సిద్ధూ మూసేవాల పంజాబీ పాటలు వింటున్న వీడియో ఒకటి అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. దీనిని ఆరు వారాల క్రితం పోస్టు చేశాడు. మూసేవాలా మరణించాక 'రిప్‌ పాజీ' అని సాహిల్‌ ఇన్‌స్టా స్టోరీ కూడా పోస్టు చేశాడు.