శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (13:01 IST)

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ భర్త ఆత్మహత్య.. ఎక్కడ?

suicide
కట్టుకున్న భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన భర్త పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని సరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దిల్‍‌సుఖ్ నగర్ పీ అండ్ టీ కాలనీకి చెందిన శేఖర్ (36) అనే వ్యక్తికి మాల్కాజ్‌గిరికి చెందిన నాగాంజలితో గత 2014లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగాంజలి హైదరాబాబాద్ నగరంలోని కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పని చేస్తుంది. అక్కడ నుంచి డీజీఎంగా పదోన్నతి పొంది అదిలాబాద్‌‍కు బదిలీ అయింది. అప్పటి నుంచి అమె అక్కడే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. 
 
ఈ క్రమంలో నాబార్డ్‌లో పని చేసే తేజ స్వరూపరెడ్డితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ తరచూ ఫోనులో మాట్లాడుకోవడం, వీడియో కాల్, చాటింగ్ చేసుకోవడాన్ని గుర్తించిన శేఖర్.. భార్యను మందలించాడు. దీంతో ఆమె తప్పును అంగీకరించి ఇకపై తప్పు చేయనని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె మరింతగా హద్దుమీరిపోయింది. 
 
భర్తను ఏమాత్రం లెక్క చేయకుండా, కనీసం పట్టించుకోకుండా, పిల్లలను చూపించకుండా నడుచుకోసాగింది. పైగా, భర్త శేఖర్‌పై అదిలాబాద్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు భార్యాభర్తలిద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత భర్తను నాగాంజలి నానారకాలైన దుర్భాషలాడారు. 
 
దీంతో తీవ్ర మనస్థాపం చెందిన శేఖర్ ఈ నెల 8వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే, శేఖర్ ఆత్మహత్యాయత్నానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి బయటపడింది. దీని ఆధారంగా చేసుకుని మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగాంజలి, ఆమె తల్లిదండ్రులు, నాగాంజలి ప్రియుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.