1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (10:51 IST)

వట్టినాగులపల్లిలో యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దారుణం జరిగింది. అర్థరాత్రి ప్రియురాలి బెడ్రూంలోకి చొరబడిన ప్రియుడు కత్తితో గొంతు కోశాడు. గంజాయి మత్తులో ప్రేమ్ సింగ్ ఈ దారుణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జీడిమెట్లకు చెందిన బాయన ప్రేమ్ సింగ్ (21) కేపీహెచ్‌బీలోని ఎంఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న గొడీల రూఖీ సింగ్ (21) అనే బంధువు యువతితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. 
 
ఈ క్రమంలో వట్టినాగులపల్లికి చేరుకున్న ప్రేమ్ సింగ్ బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యువతి బెడ్ రూమ్ తలుపు తన్ని లోనికి చొరబడ్డాడు. కత్తితో యువతి గొంతు కోయడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. 
 
కుటుంబ సభ్యులు లేచి యువకుడిని పట్టుకుని చితకబాది బంధించారు. యువతికి గొంతు, అరచేయి, కాలు, మణికట్టు వద్ద కత్తి గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆ యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.