గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (09:01 IST)

ప్రేమించలేదని తల్లి ఎదుటే బాలికను 10 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. ఎక్కడ?

knife
ప్రేమ పేరుతో మైనర్ బాలికలు, అమ్మాయిలపై వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను 10 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో జరిగింది. ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, కల్యాణ్ జిల్లాలోని తిస్‌గావ్‌కు చెందిన ఓ బాలిక (12)ను ఆదిత్య కాంబ్లే (20) అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేదిస్తున్నాడు. కానీ, అతని ప్రేమను ఆ బాలిక తిరస్కరించింది. దీంతో బాలికపై అతను కోపం పెంచుకున్నాడు. 
 
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆ బాలిక తన తల్లితో కలిసి ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా ఆమెపై దాడి చేశాడు. తన ప్రేమను తిరస్కరించిందనే నెపంతో ఆమె తల్లి ముందే విచక్షణారహితంగా బాలికను 10 సార్లు కత్తితో పొడిచాడు. కత్తి పోట్లకు గురైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలికపై దాడి చేసిన తర్వాత నిందితుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంబ్లే పై ముందుగా హత్య కేసు, తర్వాత ఆత్మహత్యకు యత్నించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. 
 
భార్యకు అక్రమ సంబంధం ఉందంటూ పురుగుల మందు తాగిన భర్త 
 
తన భార్యను కలిసి జీవిద్దామంటూ పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని పేర్కొంటూ ఓ వ్యక్తి తన చిన్న కుమారుడికి పురుగుల మందు తాపించి, తాను కూడా తాగి చనిపోయాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పెద్దరాజుపల్లి అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన అరసాని రాజు (44), అనిత అనే వారు 14 యేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అనిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి, అక్కడే ప్రైవేట్ టీచర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. 
 
ఈ క్రమంలో గురువారం తెల్లవారే సమయంలో హఠాత్తుగా ఓ చేత్తో వేట కొడవలి, మరో చేత్తో పురుగుల మందు డబ్బాను పట్టుకుని ఆగ్రహంతో ఊగిపోతూ భార్య ఉంటున్న ఇంటికి వచ్చాడు. అతని తీరును చూసిన స్థానికులు భయభ్రాంతులకుగురయ్యారు. ఆయన్ను ఆపే ప్రయత్నం చేయలేదు. దీంతో నేరుగా ఇంట్లోకి వెళ్లిన రాజు... చిన్న కుమారుడు ఉజ్వల్ (4) పడుకునివుండగా, అతడికి బలవంతంగా పురుగుల మందు తాపించాడు. ఆ తర్వాత తాను కూడా తాగి కుప్పకూలిపోయాడు. స్థానికులంతా కలిసి వారిద్దరినీ ఆస్పత్రికి తరలించేలోపు వారు ప్రాణాలు కోల్పోయారు. బిడ్డను కోల్పోయిన అనిత బోరున విలపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.