1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మే 2024 (08:43 IST)

ఓయో టౌన్‌హౌస్‌లో ప్రియురాలితో కలిసి బసచేసిన ప్రియుడు అనుమానాస్పద మృతి!!

deadbody
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన ప్రియురాలితో కలిసి ఓయో టౌన్‌హౌస్ హోటల్‌లో బస చేసిన ప్రియుడు తెల్లవారేసరికి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో వెలుగు చూసింది. మృతుడిని పాలమూరు జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్‌గా పోలీసులు గుర్తించారు. మంగళవారం రాత్రి ఎస్ఆర్ నగర్‌లోని ఓయో టౌన్‌హౌస్ హాటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) అనే ఇటుకల వ్యాపారికి అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఏడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో హేమంత్ యువతితో కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి ఎస్ఆరనగర్‌లోని ఓయో టౌన్‌హౌస్‌లో గది తీసుకుని బస చేశారు. 
 
మద్యం సేవించిన హేమంత్ రాత్రి 2 గంటల ప్రాంతంలో టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే, ఎంతసేపటికి అతడు బాత్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన యువతి వెళ్లి చూసింది. దాంతో హేమంత్ బాత్రూమ్‌లో స్పృహలేకుండా పడి ఉండడం గమనించి, వెంటనే అతని స్నేహితులకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
 
దీంతో స్నేహితులు లాడ్జీకి వచ్చి హేమంత్‌‍ను బెడ్‌పై పడుకొబెట్టి 108కు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే అతడు చనిపోయినట్లు తెలిపారు. కుమారుడి మృతి విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే హేమంత్ మరణానికి కారణాలు తెలుస్తాయని ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.