శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (10:27 IST)

భర్తతో పాటు కుటుంబ సభ్యుల వేధింపులు... యువతి సూసైడ్ అటెంప్ట్

noorjahaan
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. కట్టుకున్న భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు పెట్టే బాధలను భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ పనికి పాల్పడేముందు ఆమె ఓ సెల్ఫీ వీడియో తీసింది. ఇది వైరల్ అయింది. ఈ ఘటన జిల్లాలోని గీసుకొండ మండలం కోటగండి వద్ద జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. ఖానాపురం మండలం కేంద్రానికి చెందిన సూర్జాహాన్ అనే యువతి అదే గ్రామానికి చెందిన శరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. 
 
అయితే, గత కొన్ని రోజులుగా అత్తమామలు, ఆడబిడ్డతో సహా భర్త కూడా తీవ్ర వేధింపులకు గురిచేయసాగారు. వరకట్నం తేవాలంటూ చిత్ర హింసలు పెడుతూ వచ్చారు. దీనిపై పలుమార్లు గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. అయినప్పటికీ శరత్‌, అతని కుటుంబ సభ్యుల్లో ఎలాంటి మార్పురాలేదు. 
 
ఈ బాధలు భరించడం కంటే చావే శరణ్యమని భావించి మంగళవారం పురుగుల మందు తాగింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు.
 
అయితే, నూర్జాహాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడేముందు ఒక సెల్ఫీ వీడియోను తీసింది. "నా చావుకు నా భర్త, ఆడబిడ్డ, మా బావ, మా అత్తమామలే కారణం. నేను ప్రేమ పెళ్లి చేసుకున్నా. కులం తక్కువని కట్నం కోసం వేధిస్తూ కొట్టడమే కాకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారు. అనేక పోలీస్ స్టేషన్లకు తిరిగాను. నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళితే వారు నా వద్ద డబ్బులు తీసుకుని న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగలేదు. అందుకే చనిపోతున్నా... నాలాంటి పరిస్థితి మరో అమ్మాయికి రాకుండా చూడండి ప్లీజ్" అంటూ వీడియోలో పేర్కొన్నారు.