హిమాచల్ ప్రదేశ్లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఓ దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు వేధింపులకు దిగాడు. పాఠశాలలో చదువుతున్న 24 మంది బాలికలను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడి అసభ్య చేష్టలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వాటిని భరించలేని బాలికలకు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ కామాంధ ఉపాధ్యాయుడుని అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సిర్మౌర్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 24 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. టీచర్ చేష్టలు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో బాధిత బాలికలంతా వెళ్లి ప్రిన్సిపాల్ కాంతాదేవికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఈ ఫిర్యాదును లైంగిక వేధింపులు నిరోధక విభాగం పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉపాధ్యాయుడుని అరెస్టు చేశారు.
దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... సదరు కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత వేధింపులు నిజమని తేలడంతో ఉపాధ్యాయుడుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి సదరు టీచర్కు వ్యతిరేకంగా ఆందోళన చేయగా, వారికి పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.