పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక ఓ నవవధువు పెళ్లైన రెండు నెలలకే తనువు చాలించింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం సాలె బంజరకు చెందిన మాలోతు శ్రీనివాస్, నాగమణి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె పూజిత. అదే గ్రామానికి చెందిన జాటోతు శ్రీనివాస్ అనే యువకుడికి ఇచ్చి ఏప్రిల్ 16న ఘనంగా పెండ్లి చేశారు. శ్రీనివాస్ హైదరాబాద్ కేపీహెచ్బీ సర్వీస్ రోడ్డులో ఉన్న ఒక నగల దుకాణంలో సేల్స్మాన్గా పనిచేస్తున్నాడు.
పెండ్లి తర్వాత అక్కడికి సమీపంలోని టెంపుల్ బస్టాప్ దగ్గర కాపురం పెట్టారు. పెళ్లికి ముందు బంధువులతో కలిసి కూల్ డ్రింక్స్ తాగిన వీడియోను శ్రీనివాస్కు వాట్సాప్లో వచ్చింది. అందులో శ్రీనివాస్కు పడని వారు కూడా వున్నారు. తనకు పడని వారితో పూజిత కూల్డ్రింక్స్ తాగిందని శ్రీనివాస్ వేధింపులకు గురి చేశాడు.
పూజిత ఎంత నచ్చజెప్పిన శ్రీనివాస్ తీరు మారలేదు. దీనితో మనస్తాపానికి గురైన పూజిత శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయంపై పూజిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాస్, అతడి కుటుంబసభ్యులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.