1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మే 2023 (10:35 IST)

ఒక రాంగ్ ఫోన్ కాల్.. ఇద్దరి ప్రాణాలు తీసింది.. ఎలా?

cell phone
ఒక రాంగ్ ఫోన్ కాల్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్‌లో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన రాజేశ్ అనే యువకుడు ఇటీవల మృతి చెందాడు. దీనిపై పోలీసులు ఆరా తీయగా కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆరు నెలల క్రితం సుజాత అనే టీచర్ ఫోన్ నుంచి రాజేశ్‌కు ఓ రాంగ్ ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ప్రారంభమైంది. సుజాత్ ఫోన్ డీపీ చూసిన రాజేశ్‌.. సుజాతకు పెళ్లి కాలేదని భావించి, ఆమెను ప్రేమించసాగాడు. పైగా, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాట్సాప్ మెసేజ్ సందేశాలు, ఫోన్ సంభాషణలు బాగానే జరిగాయి. 
 
నిజానికి టీచర్ సుజాతకు వివాహమై ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది. ఈ విషయాన్ని దాచిపెట్టిన సుజాత... రాజేశ్‌‍తో కలిసి అనేక ప్రాంతాల్లో విహరించింది. వారిద్దరూ కలిసి పలుమార్లు ఏకాంతంగా కలుసుకున్నారు. అలా కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత సుజాతకు వివాహం జరిగిందన్న విషయం తెలుసుకుని ఆమెపై రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను దూరం పెట్టసాగాడు. రాజేశ్ తనను దూరం పెట్టడాన్ని సుజాత జీర్ణించుకోలేక పోయింది. అయితే, ఓ సారి కలుద్దాం రమ్మంటూ సుజాత అతనికి మెసేజ్ పెట్టింది. రాజేశ్ స్పందించకపోవడంతో తాను చనిపోతానని బెదిరించింది. నువ్వు చనిపోతే తాను కూడా చనిపోతానంటూ రాజేశ్ రిప్లై ఇచ్చాడు. 
 
ఈ క్రమంలో సుజాతను కలుసుకునేందుకు రాజేశ్ హయత్ నగర్‌కు వచ్చాడు. అప్పటికే సుజాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పైగా, ఈ విషయం సుజాత కుమారుడు, కుమార్తెకు తెలిసింది. రాజేశ్ రాగానే సుజాత కుమారుడు మరో ముగ్గురితో కలిసి దాడి చేశాడు. ఆ తర్వాత రాజేశ్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం.. దాడి చేయడం వల్లే రాజేశ్ చనిపోయివుంటాడన్న కోణంలో విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మొత్తంమీద ఓ మిస్డ్ ఫోన్ కాల్ ఇద్దరి ప్రాణాలు తీసింది.