గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (13:15 IST)

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు : జగన్ జిల్లాలో బాబు - బాబు జిల్లాలో జగన్ గెలుపు

ఇదేంటిది.. ఒకరి జిల్లాలో మరొకరు గెలవడం ఏమనుకుంటున్నారా? అదే ఇక్కడ ట్విస్ట్. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో తెలుగుదేశం పార్టీ మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి విజయకేతనం ఎగుర

ఇదేంటిది.. ఒకరి జిల్లాలో మరొకరు గెలవడం ఏమనుకుంటున్నారా? అదే ఇక్కడ ట్విస్ట్. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో తెలుగుదేశం పార్టీ మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి విజయకేతనం ఎగురవేస్తే.. అదే విజయాన్ని జగన్ చంద్రబాబు జిల్లాలో చూపించారు. ఈసారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎక్కువ కావడమే కాదు. పోటాపోటీగా జరిగాయి. అయితే చివరకు వైసిపి మద్దతిచ్చిన ఇద్దరు కమ్యూనిస్టులే ఎమ్మెల్సీలుగా గెలిచారు. 
 
అధికార పార్టీ టిడిపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల కోటాలో క్లీన్ స్వీప్ చేసిన అధికార పార్టీ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. పిడిఎఫ్‌ అభ్యర్థులు ఇటు ఉపాధ్యాయ స్థానానికి, అటు పట్టభద్రుల స్థానానికి విజయం సాధించారు. కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో పాటు వైసిపి తమకు మద్దతు ప్రకటించడం వల్లే ఈ విజయం సాధ్యమైందంటున్నారు అభ్యర్థులు.
 
సీఎం నారాచంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కమ్యూనిస్టులు ఎర్రజెండా ఎగురవేశారు. అదికూడా ప్రతిపక్ష నేత జగన్ మద్దతుతో ఇద్దరు కమ్యూనిస్టులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రధాన ఎన్నికలను తలపించేలా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలను చిత్తుగా ఓడించి పిడిఎఫ్‌ అభ్యర్థులు గెలుపొందారు. చిత్తూరు జిల్లానే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల విజయం చర్చనీయాంశంగా మారింది. ఒకరేమో ఉపాధ్యాయ సమస్యలపై, మరొకరేమో విద్యార్థుల సమస్యలపై పెద్దల సభలో గళం విప్పుతూ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. దీంతో వారికే తిరిగి పట్టం కట్టారన్నది రాజకీయ విశ్లేషకుల భావన. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల ముందువరకు పెద్దగా పట్టించుకోని అధికార పార్టీ ఆ తర్వాత సీరియస్‌గా తీసుకుంది. కారణం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్సీగా నిలబడిన వ్యక్తుల్లో మంత్రి బంధువులు ఉండడం. అందులోనూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, పురపాలకశాఖా మంత్రిగా కొనసాగుతున్న నారాయణ కావడమే. నారాయణకు సమీప బంధువు వేమిరెడ్డి పట్టాభిరెడ్డి. ఈయనే తెలుగుదేశం పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో నిలిచాడు. దీంతో పైరవీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కళాశాలలను నడుపుతున్న నారాయణ ఇక ప్రత్యర్థులను ఈజీగా ఓడించేస్తారని అందరూ అనుకున్నారు. అదేవిధంగా మంత్రి నారాయణ ముందుకు వెళ్ళారు. పట్టభద్రులకు సంబంధించి ఎలా విజయం సాధించాలన్న దానిపై అందరితో మాట్లాడారు. కానీ చివరకు విజయం పట్టభద్రుల్లో పిడిఎఫ్‌ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులరెడ్డినే వరించింది.
 
వైసిపి మద్దతు వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని మొదట్లో పిడిఎఫ్‌ అభ్యర్థులు చెప్పినా చివరకు ఆ పార్టీ మద్దతే ఎక్కువగా అవసరం వచ్చిందనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఇద్దరు పిడిఎఫ్‌ అభ్యర్ధులు చిత్తూరు జిల్లాలో గెలవడంతో ఆ పార్టీ సీనియర్ నేతల్లో భయం పట్టుకుంది. చంద్రబాబుకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక టిడిపి సీనియర్ నేతలు ఆలోచనలో పడ్డారు.