ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి
పాకిస్తాన్ గూఢచర్యం వ్యవహారంలో దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన జ్యోతి మల్హోత్రా గురించి ఆమె తండ్రి హరీశ్ మల్హోత్రా కొన్ని విషయాలు చెప్పారు. తన కుమార్తె పాకిస్తాన్ వెళ్తున్నట్లు తనకు అస్సలు తెలియదంటున్నారు. ''ఢిల్లీకి వెళ్లి వస్తానని చెప్పి నాలుగైదు రోజుల తర్వాత వచ్చేది. ఆ తర్వాత ఇంట్లోనే వీడియోలు చేస్తుండేది. నేను అసలు ఆమె యూ ట్యూబ్ ఇంతవరకూ చూడలేదు. పెద్దగా పట్టించుకోను కూడా. గత కొన్ని రోజులుగా ఒక్కసారిగా తన కుమార్తెకి సంబంధించి టీవీల్లో వస్తున్న వార్తలు చూసి షాక్ తిన్నాను. అసలు నా కుమార్తె అవన్నీ ఎలా చేస్తుందని అనుమానిస్తున్నాను. నాలుగు రోజుల క్రితం పోలీసులు వచ్చి మా అమ్మాయి ఫోన్, ల్యాప్ టాప్ తీసుకుని వెళ్లారు. నా కూతురు యూట్యూబ్ నేను చూడను, ఢిల్లీకి వెళ్తున్నా అని చెప్పేది, ఏం జరగాలో అదే జరుగుతుంది'' అంటూ చెప్పారు.
మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక ఉన్న చీకటి కోణాలు
పాకిస్థాన్కు గూఢచర్యం చేసిన అరెస్టయిన హర్యానా రాష్ట్రానికి లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక ఉన్న చీకటి కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె ఆదాయానికి మించి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. ఇపుడు ఈ లగ్జరీ జీవితంపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, తన ఆదాయం అంతమాత్రం అయినప్పటికీ ఆమె మాత్రం పాకిస్థాన్, చైనా దేశాల్లో పర్యటించి లైఫ్ను ఎంజాయ్ చేశారు. అలాగే ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారి డానిష్తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పైగా, ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో దిగిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విలాసవంతమైన జీవితంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన ప్రయాణాల్లో సైతం ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణించినట్లు సమాచారం. ఖరీదైన హోటళ్లలో బస చేయడం, ప్రముఖ రెస్టారెంట్లలోనే భోజనం చేయడం వంటివి ఆమె జీవనశైలిలో భాగంగా మారాయి. జ్యోతి పాకిస్థాన్ పర్యటన ఖర్చులన్నీ స్పాన్సర్లే భరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఆమె చైనాకు కూడా వెళ్లినట్లు తేలింది. అక్కడ కూడా విలాసవంతమైన కార్లలో తిరగడం, ఖరీదైన నగల దుకాణాలను సందర్శించడం వంటివి చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
ఈ యేడాది జనవరిలో జ్యోతి మల్హోత్రా కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యటించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ సమయంలో ఆమె అక్కడి పరిస్థితులు, వస్తున్న పర్యాకుల వివరాలతో సహా లొకేషన్ ఉగ్రవాదులకు చేరేట్లు చేసిందేమోనన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పర్యటన జరిగిన మూడు నెలల వ్యవధిలోనే అక్కడ ఉగ్రదాడి జరగడం గమనార్హం. ఐదు రోజుల కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గాం వెళ్లి, అక్కడ పలు వీడియోలు చిత్రీకరించింది. ఈ వీడియోలను పాక్ ఏజెంట్లకు చేరవేసిందా? పహల్గాం ఉగ్రదాడికి, జ్యోతి పర్యటనకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. జ్యోతికి చెందిన సెల్ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న తర్వాత పలు అనుమానాస్పద అంశాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు.
'ఆపరేషన్ సిందూర్' సమయంలోనూ జ్యోతి ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి దానిష్తో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. డానిష్ ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్ తీసుకువస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అక్కడున్న విలేకరులు 'ఎందుకు వచ్చావు? ఎందుకోసమని ఈ కేక్?' అని ప్రశ్నించగా.. ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా వేగంగా లోపలికి వెళ్లిపోయాడు. ఈ గడ్డం వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతోంది. పాకిస్థాన్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక వేడుక వీడియోలో కూడా ఈ వ్యక్తి కనిపించాడు. వీడియోలో జ్యోతి ఆ వ్యక్తిని కలిసినట్లు స్పష్టంగా ఉంది.