జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసులు ఆరా తీసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల క్రితం ఆమె పాకిస్థాన్ వెళ్లినట్టు తేలింది. అలాగే పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో కూడా జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్టు తేలింది.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భీకర దాడులకు పాల్పడి 26 మందిని హతమార్చిన విషయం తెల్సిందే. ఈ ఘటనకు మూడు నెలల క్రితం జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్కు వెళ్లినట్టు హర్యానా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పైగా, ఇక్కడి సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే అంశంపై పోలీసులు మరిత లోతుగా విచారణ జరుపుతున్నారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?
పాకిస్థాన్కు గూఢచర్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టు అయిన హర్యానా రాష్ట్రం హిస్సార్కు చెందిన లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఇపుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈమెకు అనేక మంది లింకులు ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలోని పూరీకి చెందిన ప్రియాంక సేనాపతితో జ్యోతికి సంబంధం ఉన్నట్టు తేలింది. ఇపుడు తాజాగా యాత్రి డాక్టరుగా గుర్తింపు పొందిన డాక్టర్ నవంకుర్ చౌదరి పేరు బయటకు వచ్చింది. జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై చిక్కుల్లో పడ్డారు.
ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ, తనపై కుట్రపూరితంగా అసత్య ప్రచారం సాగుతుందన్నారు. జ్యోతికి తనకు కేవలం పరిచయం మాత్రమే ఉందని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జ్యోతి మల్హోత్రా నాకు అభిమానిగా మాత్రమే పరిచయమన్నారు. అంతకుముందు ఆమె నాకు వ్యక్తిగతంగా తెలియదన్నారు. మేమిద్దంరం కేవలం యూట్యూబ్ గురించి కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకున్నట్టు చెప్పారు.
తాను పాకిస్థాన్కు కేవలం ఒక్కసారి మాత్రమే వెళ్లానని, అది కూడా ప్రపంచంలోని 197 దేశాలు పర్యటించాలనే నా లక్ష్యంలో భాగంగానే జరిగిందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను ఏ దర్యాప్తులోనూ లేనని, ఒకవేళ అవసరమైతే దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.