1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మార్చి 2024 (12:32 IST)

ఈసీ కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా... కమిషనర్ల నియామకం ఎలా జరుగుతుంది?

election commission
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ శనివారం రాజీనామా చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజీనామాపై ఆమోదముద్ర వేస్తూ గెజిట్‌ను విడుదల చేసింది. ఆయన పదవీకాలం మరో మూడేళ్ళు ఉండగా, అదీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొన్ని రోజుల ముందు రాజీనామా చేయడం ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం గా మారింది. ఇప్పటికే ఓ ఖాళీ ఉండగా, తాజా రాజీనామాతో ఈ ఖాళీల సంఖ్య రెండుకు చేరింది. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఇదిలావుంటే, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమిషనర్ల నియామకం ఎలా జరుగుతుందన్న చర్చ ఇపుడు ప్రారంభమైంది. 
 
భారత రాజ్యాంగంలోని 324 నుంచి 329 అధికరణలు ఎన్నికల సంఘం సభ్యుల నియామకం, జీతభత్యాలు, కాలపరిమితి, విధులను తెలియజేస్తున్నాయి. ఆర్టికల్ 324(2) అధికరణలో సభ్యుల నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారని పేర్కొంటూనే... పార్లమెంటు ఏదైనా చట్టాన్ని చేస్తే... దాని ప్రకారం నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. అయితే... రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత ఏడాది వరకు కేంద్ర ప్రభుత్వం విచక్షణ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలు జరిగేవి. 
 
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది 'ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ యాక్ట్-2023' చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం.. తొలుత కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు కేంద్ర కార్యదర్శులతో సెర్చ్ కమిటీని ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ ఐదుగురి పేర్లను సెలెక్షన్ కమిటీకి పంపాలి. నెలక్షన్ కమిటీకి ప్రధాని చైర్మన్ ఉంటారు. లోక్‌సభలో విపక్ష నేత, ప్రధాని సూచించే కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. సెలెక్షన్ కమిటీకి కొన్ని విచక్షణాధికారాలుంటాయి. సెర్చ్ కమిటీ పరిగణనలోకి తీసుకుని పేర్లను సైతం అవసరమనుకుంటే నెలెక్షన్ కమిటీ పరిశీలించవచ్చు. సెలెక్షన్ కమిటీ పంపే పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. సీఈసీ, కమిషనర్లు ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వరకూ పదవిలో ఉంటారు.