శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (19:58 IST)

మంత్రివర్గంలో దక్కని చోటు.. డిప్యూటీ సీఎంగా రోజమ్మకు జగన్ ఛాన్స్?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త కేబినెట్ శనివారం కొలువు దీరనుంది. అయితే జగన్‌ మంత్రివర్గంలో నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె పేరు కేబినెట్ కూర్పులో కనిపించలేదు. దీంతో రోజాకు మంత్రి పదవి దక్కదనే సరికి ఆమె ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. 
 
మరోవైపు కేబినెట్‌లో ఒక ముస్లిం, ఏడుగురు బీసీలు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపులు, నలుగురు రెడ్లు, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య వర్గానికి చోటు కల్పించారు. ఇక బ్రాహ్మణ వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. దీంతో అన్ని సామాజిక వర్గాల వారికి మంత్రివర్గంలో చోటు దక్కినట్లేనని, తాము సమతౌల్యత పాటించామని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  
 
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి దక్కకపోవచ్చునని, డిప్యూటీ సీఎం పదవి ఆమెను వరించనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి వర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఒక పదవి రోజాను వరిస్తుందని తెలుస్తోంది. 
 
శుక్రవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో.. 25 మంత్రులు, ఐదుగురు డిప్యూటీ సీఎంలు బాధ్యతలు నిర్వర్తిస్తారని సీఎం జగన్ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి పదవీ ప్రమాణ స్వీ కారం శనివారం జరుగనుంది. ఇంకా ఐదుగురి డిప్యూటీ సీఎం జాబితా కూడా సిద్ధమవుతుందని.. వీరిలో రోజమ్మకు తప్పకుండా స్థానం దక్కుతుందని వైకాపా వర్గాల సమాచారం.