1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (11:54 IST)

భారత చరిత్రలో చీకటి రోజు.. జలియన్ వాలాబాగ్‌కు 103 సంవత్సరాలు

Jallianwala Bagh
Jallianwala Bagh
జలియన్ వాలాబాగ్  ఊచకోత భారతీయులు ఏనాటికీ మరిచిపోరు. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన ఇది. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట.
 
1919 ఏప్రిల్ 13న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 
 
ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. 
 
ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్ధం 1951 లో ఒక స్మారకం స్థాపించబడింది. ఈ స్మారకం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. 
 
అమృత్ సర్ ఊచకోతగా పిలువబడే జలియన్ వాలాబాగ్ ఊచకోత బుధవారం నాటికి 103 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  
 
మార్చి 10, 1919న బ్రిటిష్ పాలన రౌలట్ చట్టం (బ్లాక్ యాక్ట్)ను ఆమోదించింది, దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడిన ఏ వ్యక్తిని అయినా విచారణ లేకుండా ఖైదు చేయడానికి లేదా నిర్బంధించడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. 
 
ఈ నియమం భారతీయులలో అసంతృప్తికి దారితీసింది. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. అణచివేత పాలనను వ్యతిరేకించే మార్గాలను వివరిస్తూ 1919 ఏప్రిల్ 7న గాంధీ సత్యాగ్రహి అనే వ్యాసాన్ని ప్రచురించారు. 
 
ఇద్దరు ప్రసిద్ధ భారత స్వాతంత్య్ర కార్యకర్తలు సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ కూడా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్ సర్ శాంతియుత నిరసనను నిర్వహించారు. 
 
1919 ఏప్రిల్ 9న శ్రీరామనవమి సందర్భంగా వీరిద్దరినీ అరెస్టు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1919 ఏప్రిల్ 10న వీరిని అరెస్టు చేశారు. నిరసనల దృష్ట్యా, బ్రిటీషర్లు బహిరంగ సభలను నిషేధించారు.
 
ఈ ఉత్తర్వు గురించి తెలియక, వేలాది మంది నిరాయుధులైన భారతీయులు బైసాఖీ పండుగను జరుపుకోవడానికి ఏకమయ్యారు. జలియన్ వాలా బాగ్ వద్ద ఇద్దరు నాయకులను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.  
 
దీంతో పౌరులను శిక్షించాలనే ఉద్దేశ్యంతో, బ్రిగేడియర్-జనరల్ రెజినాల్డ్ డయ్యర్ జలియన్ వాలా బాగ్ వద్దకు చేరుకుని, ఎవరూ అక్కడి నుండి పారిపోకుండా ఉండటానికి మార్గాలను మూసివేశారు.
 
ఆపై వేలాది నిరాయుధులైన పౌరుల గుంపులోకి కాల్పులు జరపమని దళాలను ఆదేశించారు.హెచ్చరిక లేకుండా, దళాలు గుంపుపై కాల్పులు జరిపి, మందుగుండు సామగ్రి అయిపోయే వరకు కాల్పులు కొనసాగించారు. 1,650 రౌండ్ల బుల్లెట్లు గుంపుపైకి దూసుకెళ్లాయి.
 
బ్రిటిషర్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో, చాలా మంది "ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదాలు చేసి బావిలోకి దూకారు. కాల్పులు జరిపిన తరువాత బావి నుండి 200కి పైగా మృతదేహాలను వెలికితీశారు.

ఇలా జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత ఇప్పటికీ భారత చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు ప్రముఖ రాజకీయ నేతలు జలియన్‌వాలా బాగ్ వీరులకు సలాం చేశారు. స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు.