1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 మార్చి 2022 (17:37 IST)

ఉక్రెయిన్ కోసం రష్యా దళాలపై పోరాటం చేస్తున్న తమిళనాడు యువకుడు

ఉక్రెయిన్ కోసం రష్యా దళాలపై తమిళనాడు యువకుడు పోరాటం చేస్తున్నాడు. రష్యా సైనిక కార్యకలాపాలను ఖండించే తీర్మానాలపై భారతదేశం ఐక్యరాజ్యసమితిలో గైర్హాజరవుతున్నప్పటికీ, తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఒక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థి రష్యా దళాలతో పోరాడేందుకు ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ లెజియన్ ఆఫ్ డిఫెన్స్‌లో చేరాడు.

 
కోయంబత్తూరులోని తుడియాలూర్‌కు చెందిన 21 ఏళ్ల ఆర్. సాయినికేష్ 2018లో ఉక్రెయిన్‌కు వెళ్లి ఖార్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదవడానికి అక్కడ చేరినట్లు రాష్ట్ర నిఘా వర్గాలు ధృవీకరించాయి. అతని ఐదేళ్ల కోర్సు జూలై 2022 నాటికి పూర్తవుతుంది. గత ఏడాది జూలైలో తన కుటుంబాన్ని సందర్శించాడు. దాదాపు ఒకటిన్నర నెలల పాటు వారితో ఉన్నాడు.

 
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రారంభించాలని రష్యా అధ్యక్షుడు ఆదేశించిన తర్వాత, ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనాలని విదేశీ పౌరులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సాయినికేష్ ఉక్రెయిన్‌లోని పారామిలిటరీ విభాగం అయిన జార్జియన్ నేషనల్ లెజియన్‌లో చేరారు. ఉక్రేనియన్ దళాలతో కలిసి రష్యా దళాలతో పోరాడుతున్నారు. 

 
ఉక్రెయిన్ వాలంటీర్ మిలటరీ ఫోర్స్‌లో చేరిన ఏకైక భారతీయ విద్యార్థి ఇతను. ఇతర భారతీయ విద్యార్థులు ఇంటికి తిరిగి వస్తున్నారని వర్గాలు తెలిపాయి. సాయినికేష్ 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత భారత సైన్యంలో చేరాలని భావించి దానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఎత్తు తక్కువగా ఉండటంతో ఎంపిక కాలేదు. దాంతో ఉక్రెయిన్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్లాడు.

 
రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ స్వచ్ఛంద సైనికదళంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సాయినికేష్ తన తల్లిదండ్రులకు తెలియజేసినప్పుడు వారు అంగీకరించలేదు. భారతదేశానికి తిరిగి రావాలని అభ్యర్థించారు. కానీ, అతను తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు నిరాకరించాడు. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను విచారించారు. సాయినికేష్ తల్లిదండ్రులు తమ కుమారుడి గురించి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

 
ఇదిలావుండగా, ఉక్రేనియన్ భూ బలగాలను ఉటంకిస్తూ 'కీవ్ ఇండిపెండెంట్' అనే ఆంగ్ల భాషా వార్తాపత్రిక మంగళవారం ఉక్రేనియన్ భూ బలగాలను ఉటంకిస్తూ, ఆక్రమించే రష్యా దళాలపై పోరాడేందుకు భారత యోధులు అంతర్జాతీయ దళంలో చేరినట్లు ధృవీకరించింది. "విదేశీయులు ఇప్పటికే ఉక్రెయిన్ స్వచ్ఛంద సైనిక దళమైన ఇంటర్నేషనల్ లెజియన్‌లో చేరారు. కీవ్ వెలుపల పోరాడుతున్నారు. ఉక్రేనియన్ గ్రౌండ్ ఫోర్సెస్ ప్రకారం, వాలంటీర్లు U.S, U.K, స్వీడన్, లిథువేనియా, మెక్సికో, భారతదేశం నుండి వచ్చారు,” అని తెలిపింది.