1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (13:55 IST)

అమ్మ చెప్పిందని 1000 కి.మీ యుద్ధభూమిలో జర్నీ.. 11ఏళ్ల బాలుడు హీరో అయ్యాడు..

Boy
ఒక వైపు బాంబుల మోత.. మరోవైపు ప్రజల భయాందోళనలు. ఉక్రెయిన్‌లో ఈ పరిస్థితికి జనాలు జడుసుకుంటున్నారు. ఇంటికి పరిమితమైపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కారణంగా ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. 
 
కానీ ఓ 11 ఏళ్ల బాలుడు మాత్రం తన గుండె నిబ్బరాన్ని చాటుకున్నాడు. తన తల్లి ఇచ్చిన ధైర్యంతో ఉక్రెయిన్ దేశాన్ని వీడాడు. ఏకంగా బాంబుల మోతను లెక్కచేయకుండా.. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 
 
తన తల్లి తనను దేశం వీడిపొమ్మందని.. తన ప్రాణాలను లెక్క చేయకుండా.. ఉక్రెయిన్ వదిలి వెళ్లమందని ఆ బాలుడు చెప్పడం ప్రస్తుతం వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. 11 ఏళ్ల పిల్లాడు ఏకంగా 1000 కిలోమీటర్లు ప్రయాణించి ఉక్రెయిన్‌ను వదిలి పొరుగు దేశం సురక్షితంగా చేరుకున్నాడు. 
 
అమ్మ చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్న ఆ పిల్లాడు బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉక్రెయిన్ లోని జపోరిజియా ప్రాంతం నుంచి స్లొవేకియా దేశానికి చేరుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా అనుకున్న గమ్యానికి చేరుకున్నాడని తెలిసిన ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది.
 
ఆ తల్లి నింపిన ధైర్యంతో 1000 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ పిల్లాడు ఇప్పుడు హీరో అయిపోయాడు. ఏకంగా ఆదేశ హోంశాఖా మంత్రి అభినందనలు సంపాదించాడు. ఆ 11 ఏళ్ల పిల్లాడిని యుక్రెయిన్ హోం శాఖ మంత్రి 'ద బిగ్గెస్ట్ హీరో ఆఫ్ లాస్ట్ నైట్' పేరుతో అభివర్ణించారు. 
 
ఆ పిల్లాడి ఫోటోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేయటంతో ఆ పిల్లాడు హీరోగా మారిపోయాడు. 1000 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ పిల్లాడికి తగిన ఏర్పాట్లు చేసిన గార్డులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ పిల్లాడికి  సంబంధించిన వార్తలు, ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 
స్లొవేకియా దేశంలోని తన బంధువు వద్దకు సురక్షితంగా తన బిడ్డ చేరుకున్నాడని తెలుసుకున్న ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది. స్లోవేకియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. బాలుడి తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లోనే ఉండిపోయారు.