శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (11:34 IST)

#KargilVijayDiwas కు 20 యేళ్లు.. కాలుదువ్వితే మటాషైపోతారు : ఆర్మీ చీఫ్

కార్గిల్‌ తరహా దుస్సాహం మరోసారి చేయవద్దని పాకిస్థాన్‌ను భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత గట్టిగా హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అసలు దాని గురించి మీరు ఆలోచించకండి. పుల్వామా ఉగ్రదాడి వెనుక ఉన్నది మీరే అన్న విషయం మాకు తెలుసు. దాని గురించి మా నిఘా ఏజెన్సీలు చాలినన్ని సాక్ష్యాధారాలు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. 
 
కాగా, సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ఈరోజును దేశం మరిచిపోలేని రోజుగా లిఖించుకుంది. భారత సైనికుల అసమాన ధైర్య సాహసాలను ప్రస్ఫుటించి దేశం హాయిగా ఊపిరి పీల్చుకున్నా రోజు. హిమవన్నగాల్లో చిందిన జవాన్ల రక్తం భరతమాత నుదుట తిలకం దిద్దిన రోజు. సుదూర హిమాలయ పర్వత సానువుల్లో ఘర్‌కోం అనే ఓ కుగ్రామం ఉంది. 
 
కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పల్లెలో నివాసముంటున్న తషీ నామ్‌గ్యాల్‌ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన మూడు గొర్రెలను వెతుక్కుంటూ సరిహద్దుల చివరకు వెళ్లాడు. ఆ క్రమంలో ఆయన అనేకమంది పాకిస్థానీ సైనికులు భారత భూభాగంలోకి ఎక్కిరావడం చూశాడు. పఠాన్‌ మిలటరీ దుస్తులు ధరించి బంకర్లు తవ్వుతూ అనేకమంది సాయుధులైన పాక్‌ సైనికులను కనుగొన్నాడు. హడావిడిగా కిందకు దిగివచ్చి దగ్గర్లో ఉన్న భారత సైనిక పోస్టు వద్దకు వెళ్లి విషయాన్ని నామ్‌గ్యాల్‌ చేరవేశాడు. అది డ్రాస్‌ సెక్టార్‌లోకొస్తుంది. 
 
ఆ తర్వాత నామ్ గ్యాల్ చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అక్కడి కెప్టెన్ సౌరభ్ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి ఆ ప్రాంతానికి పెట్రోలింగ్‌కు వెళ్లారు. అయితే, మధ్యలోనే వారిని పాక్ సైన్యం బంధించి తీసుకెళ్లింది. అనంతరం వారందరినీ చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. అదే ఓ భీకర యుద్ధానికి దారితీసింది. దాయాది దేశాల మధ్య 1948, 1971 తర్వాత జరిగిన మూడో యుద్ధం. 
 
527 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినా హిమ శిఖరాలపై మువ్వన్నెల జెండాయే రెపరెపలు భారత సైనికుల త్యాగనిరతిని వెల్లడిస్తోంది. ఈ అమర వీరుల త్యాగానికి గుర్తుగా ప్రతి యేటా జూలై 26వ తేదీన విజయ్ దివస్‌ను జరుపుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు అమరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించారు. 
 
ఈ విజయంపై లెఫ్టినెంట్ జనరల్ హెచ్.ఎస్. పనాగ్ స్పందిస్తూ, "85 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన కార్గిల్‌ యుద్ధంలో మనదే విజయం అయినా.. ఆ పోరు నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కార్గిల్‌ యుద్ధం మొత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తే.. ప్రథమార్థంలో మనది పేలవ ప్రదర్శన. ద్వితీయార్థంలో అత్యద్భుత ప్రదర్శన చూపించాం. తొలుత సైన్యం ఎలాంటి వ్యూహాలు లేకుండా యుద్ధానికి వెళ్లింది. వైమానిక దళంతో సైన్యానికి సమన్వయం లేదు. ద్వితీయార్థంలో సినర్జీతో విజయం రుచి ఎలా ఉంటుందో తెలుసుకున్నట్టు ఆయన వివరించారు.