1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (14:54 IST)

2022-23 వార్షిక బడ్జెట్ : మధ్యతరగతిపై వరాల జల్లు?

కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో మధ్యతరగతి, వేతన జీవులకు ఊరట నిచ్చేలా రెండు కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, వ్యక్తిగత పన్నుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, స్టాండర్డ్ డిడక్షన్. అంటే ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకోవచ్చు. 2005-06లో ఈ విధానాన్ని ఎత్తివేశారు. తిరిగి 2018-19లో ఈ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. మొదట రూ.40 వేలుగా ఆ తర్వాత రూ.50 వేలుగా పెంచింది. 
 
ఇపుడు దీన్ని మరికొంత పెంచే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, గతయేడాది మాదిరిగా రూ.10 వేలు పెంచి సరిపెట్టుకుంటారా లేదా అన్నది తెలియాల్సివుంది. 
 
మరోవైపు, కొన్ని సంవత్సరాలుగా పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. అంటే సెక్షన్ 80సీ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే వెసులుబాటు ఉంది. ఇది పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. 
 
ఈ నేపథ్యంలో చిన్నారుల విద్య కోసం చేసే పొదుపు మొత్తం, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపై కూడా కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టిసారించినట్టు సమాచారం. 
 
అలాగే, వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయ పన్ను పరిమితిని కూడా పెంచాలన్న డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సివుంది. ఈ అంశాలపై వార్షిక బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.