వరుసగా ఎనిమిదోసారి ఆసియా విజేతలుగా భారత మహిళా క్రికెటర్లు
భారత మహిళా క్రికెటర్లు వరుసగా ఎనిమిదోసారి ఆసియా విజేతలుగా నిలిచారు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత జట్టు అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన తుది పోరులో శ్రీలంకను 72 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది.
భారత జట్టులోని ఓపెనర్లు షఫాలీ వర్మ (68), స్మృతి మంథాన (59) బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తే, యువ బౌలర్ శ్రీ చరణి (4/20) బంతితో మాయ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత అమ్మాయిల జోరు ముందు లంక జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.
కాగా, ఈ మ్యాచలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు షఫారీ వర్మ, స్మృతి మంథాన అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ తొలి వికెట్కు కేవలం 12.5 ఓవర్లలోనే 129 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు.
ఫాలీ 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, స్మృతి 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు సాధించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వేగంగా ఆడటంలో కాస్త తడబడినప్పటికీ, చివర్లో కమలిని కేవలం 5 బంతుల్లోనే ఓ ఫోర్, సిక్సర్తో 15 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
అనంతరం 184 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు లంక బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ చమరి ఆటపట్టు (36) కాసేపు పోరాడినా, ఆమె ఔటయ్యాక లంక పతనం వేగవంతమైంది. ముఖ్యంగా, యువ స్పిన్నర్ శ్రీ చరణి తన అద్భుత బౌలింగ్తో లంక బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చింది.
కీలకమైన హర్షిత, నీలాక్షిక, కవిష, సుగందికల వికెట్లను పడగొట్టి లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన శ్రీ చరణికి, 3 వికెట్లు తీసిన దీప్తి శర్మ చక్కటి సహకారం అందించింది. దీంతో శ్రీలంక జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆసియా కప్న్ను గర్వంగా ముద్దాడింది.
