శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (09:54 IST)

రక్తపోటును అదుపులో పెట్టే అరటి పండు..

రక్తపోటును అదుపులో ఉంచుకోవటం కోసం ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను  అనుసరించటం, జీవన శైలిలో మార్పులు, మందులు, వ్యాయామం... ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వుంటాం. అయితే తీసుకునే ఆహారం కూడా రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటి ఆహారంలో అరటి పండు ఒకటి. రక్తపోటు వున్న వాళ్లకి వైద్యులు అరటి పండు తినమని సూచిస్తూ ఉంటారు. నిజానికి అరటిపండుకి అంత శక్తి వుందా... అనే అనుమానం అందరికీ వస్తుంది. 
 
అరటి పండు మన శరీరం మీద చూపించే ప్రభావం గురించి తెలుసుకునే ముందు మూత్రపిండాల పనితీరు గురించి తెలుసుకోవాలి. మూత్రపిండాలు మన శరీరంలోని ద్రవాలను వడపోస్తూ అదనంగా వున్న ద్రవాల్ని విసర్జించేలా చేస్తూ శరీరంలో నీటి శాతాన్ని సమంగా ఉంచుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా మన రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ఎక్కువ ద్రవాలు నిల్వ ఉండిపోతే రక్తపోటు పెరిగిపోతుంది. తక్కువ ఉంటే రక్తపోటు పడిపోతుంది. ఈ రెండూ ప్రమాదమే. 
 
ఇలా శరీరంలోని ద్రవ పరిమాణం హెచ్చుతగ్గులకు గురి కాకుండా కిడ్నీలు.. సోడియం, పొటాషంయం అనే రసాయనాల మధ్య సమతూకాన్ని పాటిస్తాయి. పొటాషియం ఎక్కువుగా నీటిని కిడ్నీల్లోకి చేరవేస్తే, సోడియం నీటిని కిడ్నీల్లోకి చేరకుండా నియంత్రిస్తుంది. మనం ఆహారం ద్వారా తీసుకున్న ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ వుండిపోయి రక్తపోటు పెరిగిపోతుంది. 
 
ఇలా జరుగకుండా ఉండాలంటే అలా నిల్వ వున్న నీటిని కిడ్నీల్లోకి చేరవేసే పొటాషియం ఉన్న ఆహారం తీసుకోవాలి. ఒక అరటి పండులో 422 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. మనకు ఒక రోజుకి అవసరమైన 4,700 మి.గ్రా. ఇది పదిశాతానికి సమానం. కాబట్టి రక్తపోటు ఉన్నవారు రోజుకో అరటిపండు తినటం మేలని వైద్యులు సలహా ఇస్తున్నారు.