మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సందీప్
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (18:37 IST)

అతిసారకు చెక్ పెట్టే పనస తొనలు...

అనేక రకాల పండ్ల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పనస పండు కూడా మన శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఏ, సి విటమిన్లు మాత్రం కాస్త స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. అయితే ఎక్కువ మోతాదులో ఈ పండును తినకూడదు. మితంగా తింటే అనేక లాభాలు ఉన్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే లవణాలు, విటమిన్లు తక్కువ కాబట్టి జీర్ణం కావడం కొద్దిగా కష్టం. 
 
పనస గింజల్లో కూడా నీటి శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి అవి కూడా ఆలస్యంగా జీర్ణమవుతాయి. చిన్న పిల్లల్లో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారికి ఈ గింజలను కాల్చి ఇవ్వవచ్చు. పనస పండు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పనసపండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల అజీర్తి, అల్సర్ల సమస్యను కూడా నయం చేస్తుంది. పనస పండులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి. 
 
దీనిలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. జ్వరం, అతిసారతో బాధపడేవారు పనస తొనలు తింటే ఉపశమనం కలుగుతుంది. ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. జిగురు గుణం కలిగి ఉన్నందున మలబద్దకం నివారించవచ్చు. పనస పండులో విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును. 
 
బాగా మగ్గిన పండు మనో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా దోహదపడుతుంది. చర్మ, కేశ ఆరోగ్యానికి కూడా ఔషధంగా పనిచేస్తుంది. మెగ్నీషియం, క్యాల్షియం ఉన్నందున ఎముకలను బలంగా చేస్తుంది. పనసపండులో ఉన్న ఖనిజలవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పనసపండులో ఉండే ఐరన్, రక్తహీనత సమస్యను నివారిస్తుంది. రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది.