మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (11:50 IST)

జింబాబ్వేలో చిన్నారుల ప్రాణాలు హరిస్తున్న "మీజిల్స్"

anti-vaxxers
anti-vaxxers
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన జింబాబ్వేలో మీజిల్స్ (తట్టు) అనే వ్యాధి బారినపడి అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 700 మంది వరకు చనిపోయినట్టు యూనిసెఫ్ వెల్లడించింది. ఈ యేడాది ఏప్రిల్ నెలలో మనికాల్యాండ్ ప్రావిన్స్‌లో తొలి మీజిల్స్ కేసు నమోదు కాగా, అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 6,291 మీజిల్స్ కేసుులు నమోదయ్యాయి. ఇందులో 698 మంది చనిపోయారు. గత రెండు వారాలుగా చనిపోయిన చిన్నారు సంఖ్య 158గా వుంది. ఇపుడు ఈ సంఖ్య 700కు పెరిగినట్టు యూనిసెఫ్ వెల్లడించింది. 
 
ఈ వ్యాధి సోకడానికి ప్రధాన కారణం వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోకపోవడమేనని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. మరణించిన చిన్నారుల్లో అత్యధికమంది టీకాలు తీసుకోనివారేనని వెల్లడించింది. దీనికి కారణం తమ మనస్సుల్లో గూడుకట్టుకునిపోయిన మత విశ్వాసాలేనని చెప్పారు. 
 
దీంతో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించేందుకు ముందుకు రావడం లేదని, ఫలితంగా బిడ్డలను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిపోతున్నారని చెప్పారు. 
 
ఇదిలావుంటే, ఆరు నెలల నుంచి 15 యేళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్కరికీ మీజిల్స్ టీకా వేయాల్సిందేనని మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జోహన్నస్ మారిసా వెల్లడించారు. ఈ మీజిల్స్ అనేది ఓ అంటు వ్యాధని తెలిపారు. దగ్గు, తుమ్ము, సన్నిహితంగా మెలగడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని చెప్పారు. 
 
ఈ వైరస్ సోకిన వారికి దగ్గు, తుమ్ము, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ముఖ్యంగా, పోషకార లోపంతో బాధపడే చిన్నారుల ఈ తట్టు వ్యాధి బారినపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.