మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

విదేశాల్లో అరెస్టవుతున్న బిచ్చగాళ్లలో 90 శాతం మంది ఆ దేశీయులే...

pakistan flag
ప్రపంచ వ్యాప్తంగా బిచ్చగాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. దీంతో అనేక దేశాలకు చెందిన పాలకులు బిచ్చగాళ్లను అరెస్టు చేస్తున్నారు. అలా అరెస్టవుతున్న యాచకుల్లో 90 శాతం మంది పాకిస్థాన్ పౌరులే కావడం గమనార్హం. ముఖ్యంగా, జేబుదొంగల్లో అత్యధికంగా పాకిస్థాన్ జాతీయులు ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వమే వెల్లడించడం గమనార్హం. 
 
విదేశాల్లో పాకిస్థానీలకు సంబంధించి అక్కడి సెనే‌ట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ తెలిపారు. విదేశాల్లో అరెస్టవుతున్న వారిలో తొంబై శాతం మంది తమ దేశానికి చెందినవారే ఉన్నట్లు తెలిపారు.
 
ఇందులో ఎక్కువమంది సౌదీ, ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లేందుకు టూరిస్ట్ వీసాను ఉపయోగించుకుంటున్నట్లుగా తెలిపారు. వివిధ దేశాల్లోని పవిత్రస్థలాల్లో అరెస్టవుతున్న జేబుదొంగల్లోను పాక్ జాతీయులే అధికమని తెలిపారు. పశ్చిమాసియా దేశాలతో పాటు ఇటీవలి కాలంలో జపాన్ కూడా పాక్ జేబుదొంగలకు గమ్యంగా మారింది. 
 
సౌదీలో దాదాపు 30 లక్షలు, యూఏఈలో దాదాపు 15 లక్షలు, ఖతార్‌లో 2 లక్షల మంది పాకిస్థానీలు ఉన్నారు. ఇటీవల తమ దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న యాచకుల సంఖ్య భారీగా ఉందని నివేదిక తెలిపింది. యాచకుల సంఖ్య తమ దేశానికి పెరగడం పట్ల సౌదీ, ఇరాక్ వంటి దేశాలు పాకిస్థాన్‌కు హెచ్చరికలు కూడా జారీ చేశాయని తెలుస్తోంది.