శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: గురువారం, 17 జనవరి 2019 (19:04 IST)

పిల్ల మొసలిని పెద్ద మొసలిగా చేసిన మహిళా శాస్త్రవేత్త... దానికే ఆహారమైంది...

క్రూర జంతువులను ఎన్నటికీ నమ్మరాదు అని చెప్పేందుకు మనకు ఎన్నో ఉదంతాలు వున్నాయి. మనిషి ఎంత మంచి చేసినా రక్తం రుచి మరిగిన జంతువులు అదను వస్తే అమాంతం చంపేసి చప్పరించేస్తాయి. ఇలాంటి దారుణమైన ఘటన ఇండోనేషియాలో జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. 
 
ఇండోనేషియాలో ఓ మహిళా శాస్త్రవేత్తకు జంతువులంటే అమితమైన ప్రేమ. దాంతో ఓ పిల్ల మొసలిని తీసుకొచ్చి ఇంటికి సమీపంలోని ఓ మడుగులో వదిలి దానికి ఆహారం వేస్తూ మచ్చిక చేసుకుంది. అది అలాఅలా పెద్దదైంది. సుమారు 14 అడుగుల పొడవు పెరిగి బలిష్టంగా మారింది. ఎప్పటిలానే మహిళా శాస్త్రవేత్త మొసలి వద్దకు వెళ్లి ఆహారాన్ని వేస్తుండగా అకస్మాత్తుగా అది ఆమె చేయిని పట్టుకుంది.
 
ఏదో పెంపుడు జంతువే కదా అని అలా వదిలేసింది మహిళా శాస్త్రవేత్త. కానీ మొసలి తన పట్టును మరింత బిగించి ఆమె చేయిని కొరికి నమిలేసింది. ఆ తర్వాత మరింత ముందుకు ఉరికి ఆమెను పట్టుకుని పొట్ట భాగాన్ని తినేసింది. ఐతే ఘటనా సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత ఆమె ఇంట్లో కనబడకపోయేసరికి సమీపంలో వెతగ్గా మడుగు వద్ద గుర్తుపట్టలేని స్థితిలో ఆమె మృతదేహం కనబడింది. ఈ దారుణం మొసలి వల్లనే అని తెలుసుకున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకుని జంతు సంరక్షణశాలకు తరలించారు.