1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (08:21 IST)

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు. గురువారం ఉదయం హస్తినకు వెళ్లిన ఆయన రోజంతా బిజీబిజీగా గడిపారు. తొలి రోజైన గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 
 
ఆ తర్వాత 5.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, రాత్రి 8 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా, సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలంటూ ఆయన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ను కోరారు. 
 
ఇదిలావుంటే, శుక్రవారం ఉదయం 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. నిజానికి జగన్ ఢిల్లీ బ‌య‌లుదేరే స‌మ‌యానికి అమిత్ షా నుంచి ఎలాంటి అపాయింట్మెంట్ ద‌క్కకున్నా... అమిత్ షాను క‌లిసి తీరాల‌న్న దిశ‌గా జ‌గ‌న్ సాగారు. 
 
ఈ క్ర‌మంలో గురువారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో అమిత్ షాతో జ‌గ‌న్ భేటీ అవుతార‌న్న వార్త‌లు వినిపించాయి. అయితే గురువారం జ‌గ‌న్‌తో భేటీకి అమిత్ షా స‌మ‌యం కేటాయించ‌లేద‌ని స‌మాచారం. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌గ‌న్‌కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చిన‌ట్లుగా సమాచారం.