1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 డిశెంబరు 2018 (11:56 IST)

ఇండోనేషియాలో సునామీ - 62 మంది మృతి

ఇండోనేషియాపై సునామీ మరోసారి విరుచుకుపడింది. శనివారం రాత్రి 9.30 గంటల తర్వాత దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో అలలు విరుచుకుపడ్డాయి. అలల ధాటికి 62 మంది మృతిచెందారు. 600 మందికి పైగా గాయాలయ్యాయి. పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు జాతీయ విపత్తు సంస్థ అధికారులు వెల్లడించారు. క్రకటోవా అగ్నిపర్వతం విస్పోటనం కారణంగా సునామి సంభవించినట్లుగా సమాచారం.
 
ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్‌, దక్షిణ లాంపంగ్‌ ప్రాంతాల్లో సంభవించిన సునామీ ధాటికి 62 మంది చనిపోయారు. సుమారు 600 మందికిపైగా గాయపడినట్లు ఆ దేశ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతినిధి పుర్వో నుర్గోహో తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందన్నారు. 
 
వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని, నష్టం ఎంతనేది ఇప్పుడే అంచనా వేయలేమని స్పష్టం చేశారు. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో సునామీ వచ్చినట్లు వెల్లడించారు. అగ్నిపర్వతం బద్దలవడంతో ఈ విపత్తు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. సునామీకి గల కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు ఇండోనేషియా భూగోళ పరిశోధన విభాగం ప్రయత్నాలు చేస్తోంది.
 
బాధితులకు తక్షణం పునరావాసం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తప్పిపోయిన వారి కోసం గాలింపు సాగుతోందని చెప్పారు. క్రాకటోవ్‌ దీవిలోని అగ్నిపర్వతం బద్దలవడంతో అందులో నుంచి వెలువడ్డ లావా, బూడిద 500 మీటర్ల ఎత్తు వరకూ ఎగసిపడిందని వెల్లడించారు.