ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 10 నవంబరు 2021 (13:14 IST)

రాష్ట్ర ఎన్నికల కమీషనర్, డిజిపి గౌతం సవాంగ్ లకు లేఖ రాసిన చంద్రబాబు

ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయ‌ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. కుప్పం మునిసిఫల్ ఎన్నికల అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్, డిజిపి గౌతం సవాంగ్ లకు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. అధికార వైసీపీతో అధికారులు కుమ్మక్కై టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయనీకుండా అడ్డుకుంటున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.


స్థానిక ఎన్నికల అధికారులు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించార‌ని, నకిలీ సంతకాలతో నామినేషన్లను తొలగించార‌ని చెప్పారు. అధికార వైసీపీతో పోలీసులు కుమ్మక్కయ్యార‌ని, టీడీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకునేందుకు తప్పుడు ఫిర్యాదులతో అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నార‌ని ఆరోపించారు. 9 నవంబర్ 2021 అర్ధరాత్రి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అమరనాథ్ రెడ్డితో సహా తిరుపతి పార్లమెంటరీ టీడీపీ ఇంచార్జి పుల్లివర్తి నాని లను అరెస్ట్ చేశార‌ని, నవంబర్ 8, 2021న తప్పుడు కేసు నమోదు చేసి, 9వ తేదిన అర్థరాత్రి అరెస్టు చేశార‌ని, వారు పోలీసులకు అందుబాటులో ఉండగా అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.


ఇది టీడీపీ నేతలను ఎన్నికల్లో ప్రచారం చేయనీకుండా అడ్డుకునేందుకు, అధికార వైసీపీ చేస్తున్న ప్రయత్నం తప్పా మరొకటి కాద‌న్నారు. జరుగుతున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయ‌ని, బ్రిటీష్ రాజ్, నియంతృత్వ అధికారాన్ని గుర్తుకు తెస్తున్నాయ‌న్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.