మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (17:28 IST)

చైనాలో కరోనా వైరస్ విజృంభణ : అష్టదిగ్భంధనంలో నగరాలు (video)

చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారినపడిన చనిపోయిన రోగుల సంఖ్య 26కు చేరింది. మరో 41 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకినట్టు చైనా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యంత ప్రమాదకారిగా మారిన ఈ వైరస్ బారిన మరికొంతమంది ప్రజలు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా అష్టదిగ్బంధనం చేసింది. ఈ అష్టదిగ్బంధనంలోకి 13 నగరాలు వచ్చాయి. అంటే, ఆయా నగరాల్లోని ప్రజా రవాణా వ్యవస్థను మొత్తం నిలిపివేసింది. దీంతో నాలుగు కోట్ల మంది ప్రజలు ఎటూ కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ కోరలు చాస్తుండడంతో దేశంలో ఎక్కడా కొత్త సంవత్సర వేడుకల జాడ కనిపించలేదు. చైనా కొత్త సంవత్సరమైన మూషిక ఏడాది శనివారం నుంచే ప్రారంభమైంది. చైనాలో ఇది అతిపెద్ద పండుగ అయినప్పటికీ ఎక్కడా సందడి లేదు. వ్యాధి మరింత విస్తరించకుండా చేపట్టే చర్యల కోసం ప్రభుత్వం వంద కోట్ల యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1008 కోట్లు కేటాయించింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స కోసం సైన్యంలోని వైద్యాధికారుల్ని రంగంలోకి దించారు. ఇక, చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఆదివారం జరగాల్సిన భారత రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేశారు.