శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (13:10 IST)

ఈస్టర్ డే పేలుళ్ళ కవరేజీకి వెళ్లిన భారతీయ జర్నలిస్టు... అరెస్టు చేసిన శ్రీలంక

శ్రీలంక రాజధాని కొలంబోలో గత ఏప్రిల్ నెల 21వ తేదీన ఈస్టర్ సండే రోజున వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో సుమారుగా 350 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్ళను యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ పేలుళ్ళను లైవ్ కవరేజ్ చేసేందుకు భారత్ నుంచి ఫోటో జర్నలిస్టు సిద్ధిఖీ అహ్మద్ డానిష్ కొలంబోకు వెళ్లాడు. ఆయన్ను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ముందస్తు అనుమతిలేకుండా ఓ స్కూల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినందునే ఆయనను అరెస్టు చేసినట్టు సమాచారం. నెగొంబో నగరంలోని ఓ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడేందుకు సిద్దిఖి బలవంతంగా లోపలికి వెళ్లబోయినట్టు శ్రీలంక స్థానిక మీడియా వెల్లడించింది. ఈస్టర్ రోజు సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన కాల్పుల్లో ఓ విద్యార్ధి చనిపోయాడనీ.. అతడి గురించి వివరాలు తెలుసుకునేందుకు సిద్దిఖి లోపలికి వెళ్లబోయారని తెలిపింది.
 
అయితే అక్కడే ఉన్న కొందరు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. 'అనుమతి లేకుండా చొరబాటుకు ప్రయత్నించిన అభియోగాలపై ఆయన అరెస్ట్ అయ్యారు. అనంతరం ఈ నెల 15 వరకు నెగొంబో మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించారు' అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.