1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (08:51 IST)

డ్రాగన్ కంట్రీని షేక్ చేస్తున్న కరోనా మహమ్మారి.. స్కూల్స్- మాల్స్ మూసివేత

ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా. ఇపుడు ఈ డ్రాగన్ కంట్రీ మరోమారు ఈ వైరస్ దెబ్బకు వణికిపోతోంది. తాజాగా ఈ వైరస్ నుంచి పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్లు చైనాను వణికిస్తున్నాయి. 
 
ఇపుడు ఈ కొత్త వేరియంట్లు చైనాను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో, కట్టడి చర్యలకు దిగింది కమ్యూనిస్టు సర్కార్.. వందలాది విమాన సర్వీసులను రద్దు చేసింది, స్కూళ్లను మూసివేసింది.. ఇదేసమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెద్ద సంఖ్యలు పెంచింది. కోవిడ్‌ కేసులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు విధించింది.
 
తాజాగా డ్రాగన్ కంట్రీలో వృద్ధ దంపతులు సహా చాలా మంది పర్యాటకులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరంతా షాంఘై నుంచి మొదలై గ్జియాన్‌, గాన్సు ప్రావిన్స్‌, ఇన్నర్‌ మంగోలియాలో పర్యటించినట్టు గుర్తించారు. దీంతో రాజధాని బీజింగ్‌ సహా ఐదు ప్రావిన్స్‌ల్లో పెద్దఎత్తున ప్రజలతో కాంటాక్టు అయినట్టు కూడా నిర్ధారణకు వచ్చి చర్యలు చేపట్టింది. 
 
ఆయా ప్రాంతాల్లో విహార కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను మూసివేసి లాక్డౌన్‌ ప్రకటించాయి. వాటిలో భాగంగా 40 లక్షలకు పైగా జనాభా ఉన్న లాన్‌జూ నగరంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ కఠిన ఆంక్షలు విధించింది ప్రభుత్వం.. ఇక, గ్జియాన్‌, లాన్‌జూల్లో 60 శాతం విమాన సర్వీసులను రద్దు చేశారు. 
 
ఇన్నర్‌ మంగోలియాలోని ఎరెన్‌హట్‌కు రాకపోకలను నిలిపివేశారు. కాగా, డ్రాగన్‌ కంట్రీలో వరుసగా ఐదో రోజు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. గురువారం 13 మందికి పాజిటివ్‌గా తేలగా.. అధిక కేసులు ఈశాన్య, వాయువ్య ప్రాంతాలకు చెందినగా అధికారులు చెబుతున్నారు.