1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (11:18 IST)

సుధీర్ఘ అంతరిక్ష యాత్రకు చైనా శ్రీకారం - 183 రోజులు అక్కడే...

డ్రాగన్ కంట్రీ చైనా సుధీర్ఘ అంతరిక్ష యాత్రను చేపట్టింది. తమ కొత్త అంతరిక్ష కేంద్రానికి శనివారం ముగ్గురు వ్యోమగాములను సురక్షితంగా చేర్చింది. ఈ ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో 183 రోజులు గడుపనున్నారు. 
 
మంగోలియాలోని గోబీ ఎడారిలోని జికుయాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్‌ మార్చ్‌-2 ఎఫ్ రాకెట్‌పై షెంజౌ-13 అంతరిక్ష నౌకను చైనీస్‌ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రయోగించారు.
 
అంతరిక్ష నౌక ప్రయోగించిన 6:30 గంటల అనంతరం టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో క్షేమంగా ల్యాండ్ అయింది. అంతరిక్ష నౌకలో ప్రయాణించిన ఝాయ్‌ ఝింగాంగ్, వాంగ్ యాపింగ్, యి గ్వాన్‌ఫులు క్షేమంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. 
 
వ్యోమగాములు దాదాపు 6 నెలలు ఇక్కడే ఉండి పని చేస్తారు. ఇది ఇప్పటివరకు చైనా చేపట్టిన సుదీర్ఘ మిషన్‌గా చెప్పవచ్చు. వీరు స్టేషన్ సాంకేతికతను పరీక్షించడమే కాకుండా అంతరిక్షంలో నడవనున్నారు.
 
మిషన్ కమాండర్‌గా ఝాయ్‌ వ్యవహరించనున్నాడు. ఝాయ్‌ 2008లో చైనా తరఫున తొలి అంతరిక్ష నడక చేపట్టాడు. అతనికి చైనా ప్రభుత్వం స్పేస్ హీరో అనే బిరుదును ఇచ్చింది. 
 
యి గ్వాన్‌ఫుకు ఇది మొదటి అంతరిక్ష యాత్ర. అతను ప్రస్తుతం మిలిటరీ వ్యోమగామి బ్రిగేడ్‌లో రెండవ స్థాయి వ్యోమగామిగా ఉన్నారు. వీరిద్దరితోపాటు వాంగ్ యాపింగ్ అనే మహిళ కూడా ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన చైనా తొలి మహిళా వ్యోమగామిగా వాంగ్‌ నిలిచారు. అంతరిక్ష నడక చేసిన తొలి చైనా మహిళ కూడా వాంగ్ కావడం విశేషం‌.