1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (15:38 IST)

చైనాకు గట్టిగా బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతున్న భారత బలగాలు

చైనాకు గట్టిగా బుద్ది చెప్పేందుకు భారత బలగాలు సిద్ధమయ్యాయి. గల్వాన్‌ లోయ దగ్గర ఘర్షణల్లో మన సైన్యంపై ఆయుధాలతో డ్రాగన్‌ మూకలు దాడికి పాల్పడిన విషయం అందరికీ తెలుసు. అప్పుడు చైనా బలగాల దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత్‌ సైన్యం ఇప్పుడు కొత్త ఆయుధాలను సమకూర్చుకుంది. సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఆయుధాలను వినియోగించరాదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉన్నకారణంగా ప్రాణహాని లేని ఆయుధాలు తయారు చేయిస్తోంది. 
 
''గతేడాది గల్వాన్‌లో భారత్‌-చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చైనా బలగాలు భారత సైనికులపైకి ఇనుపరాడ్లు, టేసర్‌లను ప్రయోగించాయి. దీనికి గట్టిగా బదులిచ్చేందుకు భారత భద్రతా దళాలు ప్రాణహానిలేని ఆయుధాలు తయారు చేసే ప్రాజెక్టును మాకు అప్పగించాయి. భద్రతా బలగాలకు ఈ ఆయుధాలు అందించడం ప్రారంభించాం. వారి నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. 
 
'వజ్ర' పేరుతో మెరుపులతో కూడిన మెటల్‌ డివైజ్‌ను మా సంస్థ తయారు చేసింది. శత్రు సైనికులపై దాడి చేసేందుకు వారి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను పంక్చర్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. త్రిశూలం నుంచి కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. దాంతో ప్రత్యర్థి సెకెన్ల వ్యవధిలోనే అపస్మారకస్థితికి గురవుతాడు. సప్పర్‌ పంచ్‌ పేరుతో తయారుచేసిన గ్లౌజ్‌ కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. ఈ ఆయుధాలేవీ శత్రువుల ప్రాణాలు తీయవు. వారిని షాక్‌కు గురిచేస్తాయి'' అని మోహిత్‌ వివరించారు.