1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:11 IST)

భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలి : కేంద్ర మంత్రి గిరిరాజ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని టీమిండియాకు సూచించారు. ఇక ఈ వాదనకు బలం చేకూరుస్తూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సైతం భారత్-పాక్ మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలన్నాడు. 
 
ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 24వ తేదీన ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరగనుంది. అయితే జమ్మూకాశ్మర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఇద్దరిని చంపిన ముష్కరులు.. ఈ నెలలో ఇప్పటిదాకా 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. 
 
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినే టార్గెట్‌గా పెట్టుకుంటూ చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకుండా టీమిండియా బాయ్ కట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
 
'భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌పై పునరాలోచన చేయాలి'పేర్కొన్నారు. పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ సైతం ఈ మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌తో సత్సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలన్నాడు. 'సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్-పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలి.  కాబట్టి ఇరుదేశాల మధ్య సంత్సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం ఉత్తమం.'అని ఆయన చెప్పుకొచ్చారు.