శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (08:21 IST)

చైనా యాప్‌లపై నిషేధం.. ఇకపై చైనా ఏసీలపై కూడా.... త్వరలో అమలు

తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా సైనికులు బరితెగించి 21మంది భారత సైనికులను పొట్టనబెట్టుకుంది. ఈ చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చైనా వస్తువులన్నింటిపై నిషేధం విధించాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనాకు చెందిన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. 
 
ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే నిషేధం అమల్లోకి వచ్చింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన కాసేపట్లోనే టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 యాప్‌లు మూగబోయాయి. దీనికితోడు చైనా నుంచి దిగుమతి చేసుకొనే ఏసీలు, టీవీలు సహా 12 రకాల వస్తువులను నియంత్రించాలని భారత్‌ యోచిస్తోంది. 
 
వీటిని దిగుమతి చేసుకోవడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. నిజానికి ఈ లైసెన్స్‌ పద్ధతికి కొద్ది నెలల క్రితమే తెర లేచింది. వివిధ దేశాల నుంచి అగరువత్తులు, టైర్లు, పామాయిల్‌ దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్‌ తప్పనిసరి చేశారు. లద్దాఖ్‌ ఘర్షణల తర్వాత ఈ జాబితాలోకి చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకొనే ఏసీలు, టీవీలు, వాటి విడిభాగాలు వచ్చి చేరబోతున్నాయి.
 
దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దిగుమతి సుంకాన్ని భారీగా విధించడం, విడి భాగాల తయారీలో కనీస సాంకేతిక ప్రమాణాలను నిర్దేశించడం, కొన్ని రకాల వస్తువులను కొన్ని రేవుల ద్వారా మాత్రమే దిగుమతి చేసుకోవాలని షరతులు విధించడం ద్వారా దిగుమతులను నిరుత్సాహపరుస్తారు.