1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:13 IST)

'నుక్కడ్' రెస్టారెంట్ ఓనర్ సూసైడ్ : గర్భంతో ఉన్న భార్యను చంపి...

కరోనా వైరస్ దెబ్బకు అమెరికా వణికిపోతోంది. ఈ వైరస్ బారిన నుంచి తప్పించుకునేందుకు ఆ దేశ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రవాస భారతీయుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. నిండు గర్భవతి అయిన భార్యను చంపేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
న్యూజెర్సీ జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 26వ తేదీన గరిమా కొఠారీ అనే యువతి తన ఇంట్లో విగతజీవిగా పడివుండడాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, భర్త ఆచూకీ కోసం గాలించసాగారు. ఈ క్రమంలో ఆమె భర్త మన్మోహన్ మల్ (37) జెర్సీ సిటీలో ఉన్న హడ్సన్ నదిలో శవమై కనిపించాడు. 
 
గరిమా కొఠారీ దేహంపై అనేక గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టంలో తేలింది. అంతేకాదు, ఆమె ఐదు నెలల గర్భవతి అని కూడా వైద్య నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి హడ్సన్ నదిలో ఆత్మహత్యకు యత్నించాడన్న సమాచారంతో పోలీసులు గాలింపు జరపగా, మన్మోహన్ మల్ మృతదేహం లభించింది.
 
కాగా, గరిమా ఫేమస్ చెఫ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మన్మోహన్ భారత్‌లో ఐఐటీలో విద్యాభ్యాసం చేసిన నిపుణుడు. వీరికి జెర్సీ సిటీలో 'నుక్కడ్' అనే భారతీయ రెస్టారెంట్ కూడా ఉంది. 'నుక్కడ్'లో పనిచేసే ఉద్యోగులు మాత్రం వారిది అన్యోన్య దాంపత్యం అని చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భార్యను చంపి తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది మిస్టరీగా మారింది. దీనిపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.